ఇంట్లో దీపం కొండెక్కితే అపశకునమా?
దీపం ఆరిపోవడం నిజంగా అపశకునమా?
దీపం ఆరిపోవడానికి అసలు కారణాలు ఏమిటి?
శాస్త్రం ఏమి చెబుతోంది?
దీపం ఎంతసేపు వెలిగించాలి?
మనం చేసే సాధారణ పొరపాట్లు
భయం కాదు… భక్తి ముఖ్యం!
ఇంటికి కీడు జరుగుతుందా? అసలు నిజాలు ఇవే! మన ఇళ్లలో దేవుడి గదిలో పూజా సమయాల్లో దీపం వెలిగించడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక పవిత్ర సంప్రదాయం. అయితే, వెలిగించిన దీపం “కొండెక్కితే” (ఆరిపోతే) చాలు.. ఇంట్లో ఏదో జరగబోతోంది అని కంగారు పడేవారు, కన్నీళ్లు పెట్టుకునే వారు మనకు కనిపిస్తుంటారు. అసలు దీపం ఆరిపోవడానికి, మన జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధం ఉందా? లేక ఇదంతా మన భ్రమనా? ఈ విషయంపై ఒక విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తే…. దీపం ఆరిపోవడం: అపశకునమా? అపోహనా? అంటే చాలా మంది అభిప్రాయం ప్రకారం, పూజ మధ్యలో దీపం ఆరిపోతే అపశకునం అని, ఇంట్లో ఏదో అశుభం జరుగుతుందని నమ్ముతారు. కానీ ఇక్కడే మనం అసలు లాజిక్ మర్చిపోతున్నాం.
దీపం ఆరిపోవడానికి గల భౌతిక కారణాలు, గాలి వేగంగా రావడం, వత్తిలో లోపం ఉండటం లేదా నూనె అయిపోవడం వంటి సహజ కారణాలు ఉంటాయి. దీనికి భగవంతుడి ఆగ్రహాన్ని ముడిపెట్టడం, భయపడడం ఎంత వరకు సమంజసం? దీపం ఆరిపోగానే భయం చెందడం వల్ల మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలవుతాయి. ఈ భయం వల్ల మనమే లేనిపోని కొత్త సమస్యలను ఆహ్వానిస్తాం తప్ప, దీపం ఆరిపోవడం వల్ల సమస్యలు రావు. శాస్త్రం ప్రకారం దీపాన్ని “కొండెక్కింది” అని గౌరవంగా అంటాం తప్ప, దాన్ని అరిష్టంగా ఎక్కడా పేర్కొనలేదు. వెలిగించిన దీపం ఎంతసేపు వెలిగి ఉండాలి? అనేది మరో చర్చనీయాంశమైన పాయింట్.
రోజంతా దీపం వెలిగి ఉంటేనే ఐశ్వర్యం వస్తుందని కొందరు, కేవలం పూజ అయ్యే వరకు ఉంటే చాలని మరికొందరు వాదిస్తారు. కొన్ని ప్రత్యేక వ్రతాలు లేదా యజ్ఞాల సమయంలో మాత్రమే నిరంతర దీపం (అఖండ దీపం) అవసరం. సాధారణ గృహస్థులు నిరంతరం దీపాన్ని వెలిగించి ఉంచాల్సిన అవసరం లేదు. ప్రదోష కాలం సాధారణంగా ఉదయం మరియు సాయంత్రం పూజ ముగిసిన తర్వాత కూడా కనీసం ఒక గంట (లేదా ఒక గడియ) పాటు దీపం వెలిగి ఉండటం శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు. ఆ సమయం తర్వాత సహజంగా అది ఆరిపోయినా (కొండెక్కినా) ఎలాంటి దోషం ఉండదు. దీపం వెలిగి ఉన్నంతసేపు కాదు, ఆ దీపాన్ని చూసినప్పుడు మనలో కలిగే ఆధ్యాత్మిక భావన ఎంతసేపు ఉంటుంది అనేదే ముఖ్యం.
మనం చేస్తున్న పొరపాట్లు ఒకసారి గమనిస్తే.. దీపం ఆరిపోయేలా ఉన్నప్పుడు లేదా మసి పట్టినప్పుడు చాలా మంది చేత్తో వత్తిని సరిచేస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. అగరబత్తితోనో లేదా చిన్న పుల్లతోనో వత్తిని సరిచేయాలి. వెలుగుతున్న దీపంలో ఒక్కసారిగా నూనె పోయడం కంటే, ముందే తగినంత నూనె ఉండేలా చూసుకోవాలి. దీపాన్ని నోటితో ఊది ఆర్పడం లేదా వేళ్లతో నొక్కి ఆర్పడం మహా పాపంగా భావిస్తారు. ఇది నిజంగానే సరిన పద్ధతి కాదు. అది సహజంగా ఆరిపోయేలా చూడాలి లేదా వత్తిని నూనెలోకి మెల్లగా నెట్టి శాంతింపజేయాలి. భయం వద్దు.. భక్తి ముద్దు! దీపం అనేది జ్ఞానానికి సంకేతం. జ్ఞానం ఎప్పుడూ భయాన్ని కలిగించదు. ఒకవేళ గాలికి దీపం ఆరిపోతే, ఆందోళన చెందకుండా “ఓం నమః శివాయ” లేదా “శ్రీరామ” అని స్మరిస్తూ మళ్ళీ వెలిగించండి. భగవంతుడు మన హృదయంలోని నిశ్చలమైన భక్తిని చూస్తాడు తప్ప, గాలికి ఆరిపోయే దీపాన్ని చూసి శిక్షలు వేయడు.




