శ్రీనిధి శెట్టితో పాటు మరో హీరోయిన్పై చర్చ
వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోపై పెరుగుతున్న ఆసక్తి
విక్టరీ వెంకటేష్–త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. కుటుంబ కథలకు తనదైన వినోదం, భావోద్వేగాల టచ్ ఇచ్చే త్రివిక్రమ్.. వెంకటేష్తో తొలిసారి దర్శకుడిగా జతకడుతుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారనే ప్రచారం ఉండగా.. తాజాగా మరో బ్యూటీ పేరు ఫిల్మ్నగర్లో హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ ఈ సినిమాలో భాగమయ్యారనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఈ ప్రాజెక్ట్తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే నివేదా పాత్ర విషయంలోనే అసలు సస్పెన్స్ నెలకొంది. ఆమె కథలో కీలక పాత్రలో కనిపిస్తుందా? లేక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కొత్త షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తుందా? లేదా త్రివిక్రమ్ స్టైల్లో సెకండ్ హీరోయిన్గా కనిపించబోతుందా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఆమెను ప్రత్యేక పాట కోసం తీసుకున్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్రివిక్రమ్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. క్లాస్ టచ్, ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ కలయికలో పాటలను ప్లాన్ చేసే ఆయన.. ఈసారి వెంకీ ఇమేజ్కు తగ్గట్టుగా మాస్ టచ్తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నివేదా నిజంగా కీలక పాత్రలో నటిస్తున్నారా? లేక స్పెషల్ సాంగ్లో సందడి చేయబోతున్నారా? అన్నదానిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నివేదా పేతురాజ్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడి సినిమాలో ఆమె కనిపిస్తుందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు వెంకటేష్తో త్రివిక్రమ్ సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్లో ప్రత్యేక అంచనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో నివేదా ఎంట్రీ నిజమైతే ‘ఆదర్శ కుటుంబం’పై హైప్ మరింత పెరగడం ఖాయం.




