ఓటీపీ చెప్పండి సార్… అంతే ఖాతా ఖాళీ!
“ఓటీపీ చెప్పండి సార్…” అంటూ మొదలయ్యే మోసం
డిజిటల్ అరెస్ట్… దేశాన్ని షాక్కు గురిచేసిన కొత్త మోసం
సైబర్ నేరగాళ్లు ఎలా వల వేస్తున్నారు?
చదువుకున్నవాళ్లు కూడా ఎందుకు మోసపోతున్నారు?
ఫేక్ జాబ్స్, లింక్స్, యాప్స్… ప్రమాదం ఎక్కడైనా ఉంది
ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎప్పటికీ చెప్పొద్దు
రాత్రి 10 గంటలు…
ఫోన్ మోగింది.
“సార్… మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతోంది. వెంటనే కేవైసీ అప్డేట్ చేయాలి…”
అవతలివాడు ఎంతో మర్యాదగా మాట్లాడాడు. బ్యాంక్ ఉద్యోగిలా అనిపించాడు.
కొద్ది నిమిషాల్లోనే మొబైల్కు ఓటీపీ వచ్చింది.
“ఇది కన్ఫర్మేషన్ కోడ్ మాత్రమే సార్…” అన్నాడు.
అమాయకంగా ఆ నెంబర్ చెప్పేశారు.
ఐదు నిమిషాల తర్వాత మొబైల్ స్క్రీన్ మీద వరుసగా మెసేజ్లు…
ఖాతాలోని డబ్బంతా ఖాళీ!

ఇది సినిమా కథ కాదు…
ప్రతిరోజూ దేశంలో వేల మందికి జరుగుతున్న అనుభవాల నిజం!
స్మార్ట్ ఫోన్ మన జీవితాన్ని సులభం చేసింది అని మురిసిపోతున్నాం కానీ, అదే ఫోన్ ఇప్పుడు సైబర్ మోసగాళ్లకు పదునైన ఆయుధమైంది. జన్నాన్ని బురిడీ కొట్టేసి తేలికగా డబ్బు సంపాదించే సాధనమైంది. ఒకప్పుడు దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చేవారు. ఇప్పుడు మనమే తెలియకుండానే వాళ్లను మొబైల్ ద్వారా మన బ్యాంకు ఖాతాల్లోకి ఆహ్వానిస్తున్నాం.
వీటికి తోడు ఇటీవల “డిజిటల్ అరెస్ట్” అనే కొత్త మోసం మొదలైంది…దేశాన్ని షాక్కు గురిచేసింది.
“మీ ఆధార్తో నేరాలు జరిగాయి…”
“మీ పేరుతో పార్సెల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి…”
“మీపై కేసు నమోదైంది…”
అంటూ వీడియో కాల్ చేస్తారు. పోలీస్ యూనిఫాం, నకిలీ ఐడీలు చూపించి గంటల తరబడి భయపెడతారు. చివరకు “దర్యాప్తు పూర్తయ్యే వరకు డబ్బు సేఫ్ అకౌంట్లో వేయాలి” అంటూ లక్షలు కాజేస్తారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయ్మేమిటంటే…
ఈ మోసాలకు బలవుతున్న వారిలో చదువుకున్నవాళ్లు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఉండటం!
సైబర్ నేరగాళ్లు మన బలహీనతలపైనే దాడి చేస్తారు.
ఉద్యోగం కావాలనుకునే వారికి ఫేక్ జాబ్ ఆఫర్లు…
డబ్బు సంపాదించాలని ఆశ పడేవారికి పెట్టుబడి యాప్లు…
ఉచిత బహుమతి పేరుతో లింకులు…
సోషల్ మీడియాలో “మీ ఫోటో వైరల్ అయింది చూడండి” అంటూ వచ్చే మెసేజ్లు…
వాటికి ఆశపడి, అనాలోచితంగా ఒక్క క్లిక్ చేసామా అంతే అంతే సంగతులు. మొబైల్లోకి వైరస్ చేరుతుంది.
కొంత మంది “పార్ట్టైమ్ పని… రోజుకు ₹5,000 సంపాదించండి” అనే ప్రకటనలు చూసి టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరుతున్నారు. మొదట చిన్న మొత్తాలు ఇస్తారు. నమ్మకం పెరిగాక భారీగా డబ్బు పెట్టిస్తారు. తర్వాత గ్రూప్, యాప్, నెంబర్ అన్నీ మాయం!
అందుకే నిపుణులు ఒక మాట హెచ్చరిస్తున్నారు…!
“సైబర్ నేరాల్లో ఎదుటివారి తెలివితేటల కంటే మన ముందుజాగ్రత్త ముఖ్యం.”
ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అప్రమత్తం కావాలి.
తెలియని లింకులు క్లిక్ చేయకూడదు.
ఫోన్లో స్క్రీన్ షేరింగ్ యాప్లు ఇన్స్టాల్ చేయొద్దు.
బ్యాంకులు ఎప్పుడూ ఫోన్ చేసి పిన్, పాస్వర్డ్ అడగవు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి.
భారత ప్రభుత్వం 1930 హెల్ప్లైన్, సైబర్ క్రైమ్ పోర్టల్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే కొంత వరకు డబ్బు నిలిపి వేసే అవకాశం ఉంటుంది.
ఈ డిజిటల్ యుగంలో మన డబ్బుకు తాళం వేసేది ఇనుప లాకర్ కాదు…
మన అప్రమత్తతే!



