అధికంగా ఫోన్ చూస్తే ఆరోగ్యానికి ముప్పేనా? వైద్యులు చెబుతున్న నిజాలు
చిన్నపిల్లల్లో అధిక స్క్రీన్ టైమ్ ప్రమాదాలు
ఉదయం కళ్లు తెరిచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. మాట్లాడటం, వార్తలు చదవడం, వీడియోలు చూడటం, ఉద్యోగం, చదువు, బ్యాంకింగ్, వినోదం… ఇలా జీవితంలోని ప్రతి భాగంలో ఫోన్ ఒక భాగమైపోయింది. ఒకప్పుడు కేవలం మాట్లాడుకునేందుకు ఉపయోగించిన మొబైల్… ఇప్పుడు మన జీవితాన్ని నడిపించే సాధనంగా మారిపోయింది. కానీ ఇదే ఫోన్పై అధిక ఆధారపడటం ఇప్పుడు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
వైద్య, ఆరోగ్య నిపుణుల సలహా, సూచనల ప్రకారం ఫోన్ను అతిగా ఉపయోగించడం వల్ల కొన్ని శారీరక, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువసేపు స్క్రీన్ను చూడడం వల్ల కంటి సమస్యలు ఎక్కువగా మొదలవుతున్నాయని నేత్ర వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లు పొడిబారడం, మంటగా అనిపించడం, తలనొప్పి, చూపు మసకబారడం వంటి లక్షణాలు “డిజిటల్ ఐ స్ట్రెయిన్”లో భాగమని వివరిస్తున్నారు. ముఖ్యంగా చీకట్లో మొబైల్ వాడటం ఈ సమస్యను మరింత పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు కళ్లద్దాలు అవసరమయ్యే పరిస్థితులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
మరో ప్రధాన సమస్య మెడ, వెన్నునొప్పి. ఫోన్ చూస్తూ గంటల తరబడి తల వంచి ఉండడం వల్ల మెడపై అధిక ఒత్తిడి పడుతుంది. దీనిని వైద్యులు “టెక్స్ట్ నెక్” అని పిలుస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది మెడ కండరాలు, వెన్నెముకపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. కొందరిలో భుజాల నొప్పి, చేతుల్లో మొద్దుబారడం వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయని ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి కూడా ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న సమస్యల్లో ఒకటి. రాత్రి పడుకునే ముందు ఎక్కువసేపు ఫోన్ వాడటం వల్ల మెదడు అప్రమత్త స్థితిలోనే ఉండిపోతుంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఫలితంగా నిద్ర పట్టకపోవడం, రాత్రిళ్లు పదేపదే మెలకువ రావడం, ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, చిరాకు పెరగడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి.
మానసిక ఆరోగ్యంపై కూడా ఫోన్ ప్రభావం కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యలు కొందరిలో పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇతరుల జీవితాలతో తమ జీవితాన్ని పోల్చుకోవడం వల్ల యువతలో అసంతృప్తి, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. కొందరిలో ఫోన్ లేకపోతే అసహనం, ఆందోళన కలిగే “మొబైల్ డిపెండెన్సీ” లక్షణాలు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు.
చిన్నపిల్లల్లో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉండడం వల్ల బయట ఆటలు, శారీరక చలనం తగ్గిపోతోంది. దీనివల్ల ఊబకాయం, ఏకాగ్రత లోపం, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని బాలల వైద్యులు హెచ్చరిస్తున్నారు. భోజనం పెట్టాలంటే ఫోన్ చూపించాల్సిన పరిస్థితి కుటుంబాల్లో సాధారణమైపోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ తీవ్రమైన సమస్యలు వస్తాయనే భావన సరైంది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సమస్య ప్రధానంగా “అధిక వినియోగం” వల్లే వస్తోందని చెబుతున్నారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్లకు విశ్రాంతి ఇవ్వడం, ఫోన్ను కళ్లకు చాలా దగ్గరగా పెట్టుకోకపోవడం, చీకట్లో ఎక్కువసేపు స్క్రీన్ చూడకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గంటల తరబడి ఒకే భంగిమలో ఫోన్ చూడకుండా మధ్య మధ్యలో లేచి నడవడం, మెడకు వ్యాయామాలు చేయడం ఉపయోగకరమని చెబుతున్నారు. అవసరం లేనప్పుడు ఫోన్ను పక్కన పెట్టడం, భోజనం సమయంలో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఫోన్ వాడకాన్ని తగ్గించడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
రాత్రి నిద్రకు కనీసం గంట ముందు ఫోన్ వినియోగాన్ని తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అవసరానికి మించి ఫోన్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. రోజులో కొంతసమయం “డిజిటల్ విరామం” తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫోన్ మన జీవితాన్ని సులభతరం చేసిన గొప్ప సాంకేతిక సాధనం. కానీ అదే ఫోన్ మన ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే వినియోగంలో నియంత్రణ, అప్రమత్తత తప్పనిసరి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు




