Faith And Science 2026 శ్లోకాలు మనసుకు శాంతి.. రోగాలకు మాత్రం వైద్యం అవసరం!
Faith And Science 2026 విశ్వాసానికి విజ్ఞానం తోడైతే.. అదే నిజమైన స్పృహ!
మా చిన్నతనంలో మా గ్రామంలో ఎవరికైనా జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, అలెర్జీ వచ్చినా, పాముకాటు, తేలుకాటు వంటి సమస్యలు ఎదురైనా ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తి మా చిన్న తాత ఎన్. చిన్న ఇరగమ రెడ్డి.
చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలం, దాసరాపల్లె మా గ్రామం. మా చిన్న తాత ఎన్ చిన్న ఇరగమ రెడ్డి సర్వరోగాలకు మంత్రాలు వేసేవారు. ఎవరైనా మహిళలు మందు పెట్టి మగవారిని వశం చేసుకున్నారని అనుమానం ఉంటే, దానికి విరుగుడు మందు కూడా ఇచ్చేవారు. జాతకాలు చూసేవారు. పంచాంగం చూసి సలహాలు ఇచ్చేవారు. తనను ముత్యాలమ్మ ఆవహిస్తుందని ఆయన విశ్వసించేవారు. మా గ్రామ పంచాయతీకి పదేళ్లు సర్పంచ్గా పనిచేశారు. దాదాపు వందేళ్లు జీవించారు.
చిన్నప్పుడు ఆయన వద్ద నేను కూడా చాలాసార్లు మంత్రాలు వేయించుకున్నాను.
ఒకసారి ఆయన నన్ను అడిగారు—
“నువ్వు ఏం పని చేస్తున్నావు?”
నేను నవ్వుతూ—
“మీరు చేసే పనే చేస్తున్నాను తాతా.. దాన్ని కౌన్సెలింగ్ అంటారు. మీరు మంత్రం అంటారు” అన్నాను.
ఆ మాట ఆయనను ఆలోచింపజేసింది. .అరింత మాట్లాడారు. నేను కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్యం, శాస్త్రీయ దృక్పథం గురించి ఆయనతో మాట్లాడాను. నేను చెప్పిన విషయాలను ఆయన కూడా అర్థం చేసుకున్నారు.
మంత్రాలతో పాటు ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు సూచిస్తానని, అవసరమైతే ఆయుర్వేద మందులు కూడా ఇస్తానని చెప్పారు.
ఆ సంఘటన నాలో ఒక ఆలోచనను బలంగా నాటింది.
విశ్వాసాన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టలేం. కానీ విశ్వాసానికి విజ్ఞానాన్ని జోడించవచ్చు.
మంత్రం కంటే మనిషి మాట పనిచేసే సందర్భాలు
మన గ్రామీణ సమాజంలో మంత్రాలు, జాతకాలు, పంచాంగాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు. అవి కొన్నిసార్లు ప్రజలకు ఆశ, ధైర్యం, భరోసా, వినే వ్యక్తిని కూడా అందించేవి.
ఒక వ్యక్తి బాధతో వచ్చినప్పుడు అతని మాటలను ఓపికగా వినడం, భయపడవద్దని చెప్పడం, ధైర్యం కల్పించడం, కొన్ని నియమాలు పాటించమని సూచించడం—ఇవన్నీ మనసుపై ప్రభావం చూపగలవు.
ఇక్కడే కౌన్సెలింగ్కు, కొన్ని సంప్రదాయ పద్ధతులకు మధ్య ఒక ఆసక్తికరమైన సామాజిక సంబంధం కనిపిస్తుంది.
అయితే ఇక్కడ ఒక కీలకమైన తేడాను గుర్తించాలి.
మానసిక ధైర్యం కల్పించడం ఒకటి.. వ్యాధిని నయం చేయడం మరొకటి.
మంత్రం వల్ల భయం తగ్గినట్లు ఒక వ్యక్తికి అనిపించవచ్చు. ప్రార్థన వల్ల మనశ్శాంతి కలగవచ్చు. ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గవచ్చు. కానీ అందువల్ల మంత్రం వైరస్ను చంపుతుంది, క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది, పామువిషాన్ని నిర్వీర్యం చేస్తుంది అని నిర్ధారించలేం.
శ్లోకాలు మనసుకు ప్రశాంతత ఇవ్వవచ్చు.. కానీ వైద్యానికి ప్రత్యామ్నాయం కావు
మనిషి అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంతో పాటు మనసు కూడా ప్రభావితమవుతుంది. భయం, ఆందోళన, నిద్రలేమి, నిరాశ వంటి సమస్యలు రావచ్చు.
అలాంటి సమయంలో ప్రార్థన, ధ్యానం, శ్లోక పఠనం వంటి ఆధ్యాత్మిక ఆచారాలు కొందరికి మానసిక ప్రశాంతతను, ఆశను, ధైర్యాన్ని ఇవ్వవచ్చు.
అది వాటి మానసిక ప్రయోజనం.
కానీ రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, కిడ్నీ వ్యాధులు వంటి శారీరక సమస్యలకు సరైన వైద్య నిర్ధారణ, శాస్త్రీయ చికిత్స అవసరం.
ప్రార్థన చేయడం తప్పు కాదు.
ప్రార్థనతో పాటు అవసరమైన వైద్యాన్ని నిరాకరించడమే ప్రమాదం.
“మంత్రాలకు చింతకాయలు రాలవు” అంటే?
ఈ సామెతను మంత్రాలను ఎగతాళి చేయడానికి మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం లేదు.
దాని లోతైన సందేశం—
చర్య లేకుండా ఫలితం రాదు.
పంట కావాలంటే విత్తనం వేయాలి.
విద్యలో విజయం కావాలంటే చదవాలి.
ఉద్యోగం కావాలంటే నైపుణ్యం పెంచుకోవాలి.
ఆరోగ్యం కావాలంటే సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర అవసరం.
వ్యాధి వస్తే నిర్ధారణ, చికిత్స అవసరం.
కేవలం కోరుకోవడం వల్ల చింతకాయలు రాలవు.
కోరికకు కృషి తోడైతేనే ఫలితం.
పాముకాటుకు మంత్రం కాదు.. యాంటీవెనమ్ అవసరం
మన చిన్నతనంలో పాముకాటుకు కూడా మంత్రాలు వేసే పద్ధతులు ఉండేవి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నమ్మకాలు కనిపిస్తాయి.
కానీ పాముకాటు విషయంలో ఆలస్యం ప్రాణాంతకమవుతుంది. విషపూరిత పాము కరిచిన అనుమానం ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి. మంత్రం, తాయెత్తు, కోతలు పెట్టడం, విషం పీల్చడం వంటి పద్ధతులపై ఆధారపడటం ప్రమాదకరం.
ఇక్కడ భావోద్వేగం కాదు.. సమయం ప్రాణాన్ని కాపాడుతుంది.
భక్తి ఉండాలి.. మూఢనమ్మకం వద్దు
శాస్త్రం భక్తికి శత్రువు కాదు. భక్తి కూడా శాస్త్రాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు.
దేవుడిని నమ్మడం వ్యక్తిగత విశ్వాసం. ఆలయానికి వెళ్లడం, శ్లోకాలు చదవడం, మంత్రాలు జపించడం, ప్రార్థించడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ.
కానీ—
“మందులు అవసరం లేదు.. మంత్రం చాలు”
అని చెప్పడం మాత్రం ప్రజారోగ్యానికి ప్రమాదకరం.
అలాగే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వైద్యుడి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవడం, మందులు ఆపించమని చెప్పడం లేదా “పూజ చేస్తే సరిపోతుంది” అని నమ్మించడం బాధ్యతారాహిత్యం.
విశ్వాసానికి విజ్ఞానం తోడైతే..
నా చిన్న తాత జ్ఞాపకం ఈ సందర్భంలో నాకు చాలా విలువైనది.
ఆయన కాలంలో తనకు తెలిసిన జ్ఞానంతో ప్రజలకు సేవ చేశారు. ప్రజలు ఆయనను నమ్మారు. ఆయన మాట విన్నారు. ఆయన దగ్గర ధైర్యం పొందారు.
కానీ కాలం మారింది. విజ్ఞానం అభివృద్ధి చెందింది. వ్యాధుల కారణాలు మనకు మరింత స్పష్టమయ్యాయి. పరీక్షలు, మందులు, శస్త్రచికిత్సలు, టీకాలు, అత్యవసర వైద్య సేవలు కోట్లాది ప్రాణాలను కాపాడుతున్నాయి.
కాబట్టి పాత తరాన్ని అవహేళన చేయడం కాదు మన బాధ్యత.
వారి అనుభవాలను గౌరవిస్తూ.. వాటిలో ఉపయోగకరమైనదాన్ని స్వీకరించి.. హానికరమైన నమ్మకాలను శాస్త్రీయంగా సరిదిద్దడం మన బాధ్యత.

ప్రశ్నించడం నాస్తికత కాదు
“ఎందుకు?”
“ఎలా?”
“దీనికి ఆధారం ఏమిటి?”
“పరిశోధనలు ఏమంటున్నాయి?”
అని ప్రశ్నించడం దేవుడిని అవమానించడం కాదు. అది శాస్త్రీయ ఆలోచనకు పునాది.
విశ్వాసం వ్యక్తిగతం.
కానీ ఆరోగ్యం విషయంలో సరైన సమాచారం పొందడం సామాజిక బాధ్యత.
మన పిల్లలకు భక్తిని నేర్పుదాం. అదే సమయంలో ప్రశ్నించడం కూడా నేర్పుదాం. సంప్రదాయాలను గౌరవిద్దాం. అదే సమయంలో మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాన్ని కూడా వివరించుదాం.
చివరగా..
శ్లోకాలు మనసుకు ప్రశాంతత ఇవ్వవచ్చు.
మంత్రాలు కొందరికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు.
ప్రార్థన ఆశను కలిగించవచ్చు.
కానీ—
రోగ నిర్ధారణకు విజ్ఞానం కావాలి.
చికిత్సకు వైద్యం కావాలి.
ఆరోగ్యానికి క్రమశిక్షణ కావాలి.
మంచి జీవితం కోసం వివేకం కావాలి.
భక్తిని వదిలేయమని శాస్త్రం చెప్పదు.
భక్తితో పాటు బుద్ధిని ఉపయోగించమని మాత్రమే చెబుతుంది.
అందుకే—
భక్తి ఉండాలి.. కానీ వివేకంతో.
విశ్వాసం ఉండాలి.. కానీ విజ్ఞానంతో.
ప్రార్థన ఉండాలి.. కానీ అవసరమైనప్పుడు వైద్య చికిత్సతో.
మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు.
కానీ మనిషిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచే మాటకు మాత్రం విలువ ఉంటుంది.
ఆ మాటకు విజ్ఞానం తోడైతే.. అది మరింత శక్తివంతమవుతుంది.
అదే స్పృహ.
— డా. ఎన్. బి. సుధాకర్ రెడ్డి
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
click here to read బలవంతం కాదు.. చదువుపై ఆసక్తి పెంచే మార్గం ఇదే!
Faith And Science 2026 Faith And Science 2026 Faith And Science 2026 Faith And Science 2026 Faith And Science 2026



